అనుమతులు లేని, అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణపై.. నగర, పురపాలికల్లో విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ పురపాలకశాఖ స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని, భవిష్యత్తులో అనుమతులు లేని స్థలాలు రిజిస్ట్రేషన్లు చేయరని వెల్లడించింది.
నిర్మాణాలు, తాగునీరు, డ్రైనేజీకి అనుమతులు ఉండబోవనే విషయాన్ని అవగాహన కార్యక్రమాల్లో ప్రజలకు వివరించాలని పురపాలకశాఖ తెలిపింది. క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన... ప్లాట్లు, లేఅవుట్ల యజమానుల వివరాలు సబ్ రిజిస్ట్రార్ల నుంచి తీసుకోవాలని సూచించింది. అనుమతులు లేని స్థలాల యజమానులతో.. వార్డుల వారీ సమావేశాలు నిర్వహించాలని పురపాలకశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రతి పురపాలిక కార్యాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కరపత్రాలు పంచాలని తెలిపింది. ప్రధాన కేంద్రాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని, డప్పు చాటింపు వేయించాలని సూచించారు. మంగళ, శనివారాల్లో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించాలని తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రతి రోజూ పర్యవేక్షించేందుకు వీలుగా పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది సహా వార్డుల వారీగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఈ ప్రక్రియను ప్రతి రోజూ పర్యవేక్షించాలని తెలిపారు.
ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం