తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1,500 పడకల కొవిడ్- 19 ఆసుపత్రికి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ను కలిసి ఈ మేరకు ఆయన లేఖ అందజేశారు. గచ్చిబౌలిలో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి టిమ్స్ నిర్మించిన విషయం తెలిసిందే.
టిమ్స్ ఆసుపత్రికి సివరేజ్ ప్లాంట్ నిర్మాణాన్ని అధికారులు విస్మరించారు. ఈ కారణంగా మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళుతోంది. అక్కడ విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి.. ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తూ... ఈ మేరకు కలెక్టర్కు లేఖ అందజేశారు. వారంలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గడంపై అనుమానం: బండి సంజయ్