హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, కుసుమ కుమార్ తదితరులు హాజరయ్యారు.
తెరాస ఓడిపోయే సీటును పీవీ కుమార్తెకు వాణీదేవికి ఇచ్చారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోవడం ఖాయమని... కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె వాణి తెలుసుకుని తక్షణమే నామినేషన్ వెనక్కి తీసుకోవాలని సూచించారు. నామినేషన్ కంటే ముందే పీవీ కుమార్తె ఓటమి ఖరారైపోయిందని రేవంత్ అన్నారు.
పీవీ కుటుంబాన్ని ఓటమి పాలు చేసి సమాజానికి కేసీఆర్... ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వాణీదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయవచ్చని లేదా రాజ్యసభకు పంపొచ్చునన్నారు. పీవీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.