కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో, బోర్డ్ సభ్యులు హరీశ్ రావును ఆయన కార్యాలయంలో కలిసారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 80 కోట్లను విడుదల చేయాలని కోరారు.
బుధవారం కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని, ప్రభుత్వమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని బోర్డు సభ్యులు మంత్రులను కోరారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ మంత్రిని కలిసి పరిస్థితులను వివరించారు.
కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే అక్కడి ప్రజల బాగోగులను కేంద్రం పట్టించుకోనందున.. దేశంలోని ఏ కంటోన్మెంట్లో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేస్తుందని వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల రూ. 10 కోట్ల చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
ఇది చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ