హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి... గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్... ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి వినమ్రంగా ఓట్లు అడుగుతామన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో... కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్కు లాభం... తెరాస గెలిస్తే ప్రజలకు లాభం అనేది తమ నినాదమని తెలిపారు. ముప్పై మంది నేతలను ఇంఛార్జీలుగా నియమించినట్లు చెప్పారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తెరాసకు 54 శాతం... కాంగ్రెస్కు 42 శాతం... భాజపాకు కేవలం రెండున్నర శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు తేలిందని కేటీఆర్ వివరించారు. తొమ్మిది నెలల పాలనకు ఉపఎన్నిక రెఫరెండంగా పరిగణిస్తారా... అన్న సవాళ్లను సీరియస్గా తీసుకోమన్నారు. గతంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాళ్లు విసిరి వెనక్కి తగ్గారని గుర్తుచేశారు.
అంతా సానుకూల వాతావరణమే....
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపిన కేటీఆర్.... సభల షెడ్యూలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో హుజూర్నగర్ రైతులందరూ తెరాస వైపే ఉన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికలన్నింటిలోనూ తెరాస విజయం సాధించిందన్నారు. హుజూర్నగర్లో 2018 ఎన్నికల్లోనే సాంకేతికంగా తెరాస గెలిచిందని... ట్రక్కు గుర్తు కారణంగానే ఓడిపోయినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా కొంత ప్రభావితం చేసి ఉండొచ్చునన్నారు. ఇప్పుడు ప్రతికూలతలు లేవని... అంతా సానుకూల వాతావరణమే ఉందని కేటీఆర్ తెలిపారు. సాగర్ రైతులందరూ సంతోషంగా ఉన్నారని.. సైదిరెడ్డిపై సానుభూతి కూడా ఉందన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి అన్నది కేవలం మీడియా సృష్టేనని కేటీఆర్ కొట్టిపారేశారు.
ఇవీ చూడండి: 'పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దడాన్ని సవాలు స్వీకరించండి'