హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పద్మశాలి కాలనీలో 20 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీకి కార్మికురాలు సంతోషమ్మ రోడ్లు శుభ్రం చేస్తోంది. ఆమె కృషిని గుర్తించిన పద్మశాలి సంఘం ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆమె చేత ఆవిష్కరింపజేశారు.
తమ కాలనీలో సుదీర్ఘకాలంగా వీధులను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను గుర్తించి కార్మికుల చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భావించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. అలాగే రాజపేట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ పాత్రికేయునికి సన్మానం చేసినట్లు వెల్లడించారు.
ఈ కాలనీవాసులు తమకు ఇచ్చిన గౌరవం మరువలేనిదని జీహెచ్ఎంసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.