కరోనా... యావత్ ప్రపంచాన్ని ఒక్క ఊపు ఊపేస్తున్న పదం. ప్రతి మనిషి మీద దీని ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడిందంటే అతిశయోక్తి కాదేమో. దేశంలో గత రెండు నెలలుగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వ్యాపార లావాదేవీలేవీ నడవక రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)పై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది. జీఎస్డీపీలో కీలకంగా ఉన్న రంగాలు రెండు నెలలుగా స్తంభించగా... ఈ ఆర్థిక ఏడాది ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో 65 శాతమున్న సేవా రంగంపై లాక్డౌన్ ప్రభావం అధికంగా ఉంది. ఆ రంగానికి కీలకమైన ఏప్రిల్, మే నెలల్లో కరోనా కమ్ముకోవడం వల్ల వ్యాపారులు తీవ్రంగ నష్టపోయారు.
నామమాత్రంగా వ్యాపారాలు
తృతీయ రంగంలో ప్రధానంగా ఉన్న వ్యాపార సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు రవాణా, విమానయాన, స్థిరాస్తి వంటివి రెండు నెలలుగా నామమాత్రంగా కొనసాగడం లేదా పూర్తిగా స్తంభించిపోయాయి. దీనికి తోడు ద్వితీయంగా ఉండే తయారీ రంగం పూర్తిగా నిలిచిపోయింది. నిర్మాణాలు దాదాపు జరగనే లేదు. ప్రాథమిక రంగంలోనూ గనుల కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీఎస్డీపీపై వీటన్నింటి ప్రభావముంటుందని అర్ధగణాంక శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. లాక్డౌన్ సడలింపులతో సాధారణ కార్యకలాపాల దిశగా వెళ్తున్నా పలు విభాగాలు కోలుకోవడానికి సమయం పడుతోందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయమే కీలకం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాథమిక రంగం నుంచి జీఎస్డీపీ వాటా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో గనులు మినహా మిగతావన్నీ వ్యవసాయ అనుబంధ రంగాలున్నాయి. తెలంగాణలో వ్యవసాయం వాటా పెరుగుతోంది. గతేడాది కూడా పలు రంగాలపై వ్యతిరేక ప్రభావం ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి రేటు కొనసాగుతోంది. పంటల సాగు పరిస్థితి బాగున్నందున పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమల నుంచి తోడ్పాటు లభించే అవకాశముందని అర్ధగణాంక శాఖ అధికారులు వెల్లడించారు.
ఆర్థిక సంవత్సరం | రాష్ట్ర జీఎస్డీపీ | వృద్ధి రేటు |
2017-18 | రూ. 7,53,270 | 14 శాతం |
2018-19 | రూ. 8,61,031 | 13.9 శాతం |
2019-20 | రూ. 9,69,604 | 12.6 శాతం |
2020-21 | రూ. 11,05,136 | 14 శాతం |