లాక్ డౌన్ క్లిష్ట కాలంలో పేదలకు 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు పంపిణీపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పేదలెవరూ పస్తులు ఉండరాదన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రం చేపట్టామన్నారు. ఈ ఉదాత్త కార్యక్రమంపై ఉత్తమ్ విమర్శలు చేయడాన్ని మారెడ్డి తప్పుబట్టారు. ఇప్పటి వరకు 87.54 లక్షల మంది కుటుంబాలకు గాను 91 శాతం రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశామన్నారు. రూ.1500 సైతం బ్యాంకుల్లో జమ చేశామని వెల్లడించారు
కందిపప్పు కోసం నాఫెడ్కు లేఖ
ఇందుకోసం రూ.1103 కోట్ల రూపాయలు వరకు ప్రభుత్వం వెచ్చిందని చెప్పుకొచ్చారు. 13 లక్షల మందికి ఫోర్టబులిటీ ద్వారా రేషన్ ఇచ్చామని వివరించారు. మార్చి మాసం కన్నా ఏప్రిల్లో ఇప్పటికే అదనంగా 7 శాతం ఎక్కువైందన్నారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు తోడ్పాటు అందించేందుకు 30 కోట్ల రూపాయలు కేటాయించి 3.24 లక్షల మందికి కూడా 12 కిలోల ఉచిత బియ్యం, 500 రూపాయలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు కందిపప్పు పంపిణీ కోసం నాఫెడ్కు లేఖ రాశామని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో అది కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో... కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాయని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలకు ఇంకా రేషన్ అందలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం బాధ అనిపిస్తోంది. వారు ఈ సమాచారం ఎక్కడి నుంచి తెలుసుకున్నారో తెలియదు. కానీ హైదరాబాద్లో గానీ నల్గొండలో గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పేదలను రేషన్ వచ్చిందా లేదా అని కనుక్కొవాలి. ఇప్పటికే 91 శాతం రేషన్ సరఫరా చేశాం. గతంలో ఎప్పుడు, ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పంపిణీ చేయలేదు.
- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్