రాష్ట్రంలో తెరాస, భాజపాలు కలిసి నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో తాము ఆరోపిస్తున్నా పట్టించుకోలేదని... ఇప్పుడు భాజపా అదే అంశాన్ని తెరపైకి తెస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.
అవినీతిపై సీబీఐ విచారణ...
గాంధీభవన్ నుంచి పార్టీ కార్యకర్తలతో ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన ఉత్తమ్... కేసీఆర్ సర్కారుపై మండి పడ్డారు. నూతన మున్సిపల్ చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేశారని, స్వయంగా గవర్నరే దానిని తిప్పి పంపారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద శక్తిగా ఎదిగే అవకాశం లేదన్నారు. గత లోకసభ ఎన్నికల్లో అదృష్టం కొద్ది నాలుగు స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సీబీఐచే విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.
రాజీవ్ జయంతి వేడుకలు ఘనంగా..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఉత్తమ్ కార్యకర్తలకు సూచించారు. 22న దిల్లీలోని ఇందిరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తుమ్మిడిహట్టి వెళ్తాం... అడ్డొస్తే ఊరుకోం..
వచ్చే ఆదివారం తుమ్మిడి హట్టి దగ్గరికి కాంగ్రెస్ బృందం వెళ్లనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు, పోలీసులు తమ కార్యకర్తలను హింసిస్తే చూస్తూ ఊరుకోబోమని... ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలకు అండగా నిలువడమే కాకుండా... ఇబ్బంది పెట్టే అధికారులపై పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: సీఎస్ ఎస్కే జోషికి ఉత్తమ్ వినతిపత్రం