భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మహిళల రెండో టీ 20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లీష్ జట్టు. అసోం గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది అమ్మాయిల జట్టు. మూడు టీ 20ల సిరీస్లో 0-1తేడాతో వెనుకంజలో ఉంది.
ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోగలుగుతుంది టీమిండియా. తొలి టీ 20లో బ్యాట్స్ఉమెన్ విఫలమవగా... 160 పరుగుల లక్ష్య ఛేదనలో 119కే ఆలౌటైంది. ఇటీవల కివీస్తో జరిగిన టీ 20 సిరీస్లో ఓడిపోయింది భారత్. గత నాలుగు టీ 20ల్లో పరాజయం పాలయ్యారు అమ్మాయిలు.
భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గాయంతో సిరీస్కు దూరమైన హర్మన్ స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానాకు సారథ్యం అప్పగించారు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలంకాగా.. అనంతరం మిగతా బ్యాట్స్ఉమెన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
భారత సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ 7 పరుగులకే వెనుదిరగగా మిడిల్ఆర్డ్ర్లో ఆదుకునే వాళ్లు కరవయ్యారు. బౌలర్లలో శిఖా పాండే, పూనమ్ యాదవ్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నపటికీ.. ఇంగ్లండ్ పరుగుల ప్రవాహాన్ని ఆపలేకపోయారు.
వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టీ 20లో సత్తా చాటింది ఇంగ్లండ్ జట్టు . మూడో వన్డే నుంచే గేరు మార్చి దూసుకెళ్తోంది. ఆల్రౌండ్ ప్రతిభతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉంది.