"ఓ మంచి దర్శకుడు, నటుడితో కలిసి పనిచేస్తున్నప్పుడు... ఎంత పెద్ద సవాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తాం" అని అంటున్నారు హీరోయిన్ అదితీ రావు హైదరీ. 'సమ్మోహనం', 'అంతరిక్షం' తర్వాత ఆమె తెలుగులో చేసిన మరో చిత్రం 'వి'. నాని, సుధీర్బాబు ప్రధాన పాత్రధారులుగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ సందర్భంగా కథానాయిక అదితీ వెబినార్లో పాత్రికేయులతో ముచ్చటించింది.
- కథానాయకుడు నానికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేస్తే బాగుంటుందని అనుకుంటున్న సమయంలోనే ఈ కథ నా దగ్గరికి వచ్చింది. ఇంద్రగంటి నన్ను తెలుగుకు పరిచయం చేశారు. ఆయన పనితీరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. దాంతో నిడివి గురించి ఆలోచించకుండా నటిస్తానని చెప్పా. ఈ సినిమాలో నటించాక నానిపై అభిమానం మరింతగా పెరిగింది.
- సినిమాలో కథకు అవసరమైన భావోద్వేగాలు మా ప్రేమకథ నుంచే పండుతాయి. ఓ పాటలోనే సాహెబా పాత్ర, భావోద్వేగాలు పండాలి. అదొక పెద్ద సవాల్. పాత్రను సొంతం చేసుకుని నేను నటించా.
- అప్పటివరకు వ్యక్తిగతంగా నానిని కలవకపోయినా, ఆయనపై ప్రేమను కురిపిస్తూ సాగే ఓ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. క్లైమాక్స్లో వచ్చే ఆ సన్నివేశాన్ని తొలి రోజే చేయాల్సి వచ్చింది. అది ఎలా వచ్చిందో అనుకున్నా కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రోత్సాహాన్నిచ్చింది. సినిమా చూశాక ధనుష్, రాశీ ఖన్నా తదితరులు ఫోన్ల ద్వారా నన్ను అభినందించారు.
- మా కుటుంబంలో అందరూ తెలుగు బాగా మాట్లాడతారు. నేను చాలా తక్కువ మాట్లాడతాను. లాక్డౌన్ సమయంలో తెలుగు, తమిళం భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించా. రెండు భాషలూ ఒకేసారి నేర్చుకోవాల్సి రావడం వల్ల గందరగోళంగా అనిపించింది. తెలుగు అంటే నాకు చాలా ఆసక్తి. అందుకే 'సమ్మోహనం', 'వి' చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నా. నాతో మాట్లాడేవాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటా.
- నాకు ప్రేమకథలంటే ఇష్టం. కానీ నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటా. ప్రస్తుతం జాన్ అబ్రహాంతో కలిసి హిందీలో ఓ చిత్రం చేస్తున్నా. దాంతోపాటు మరో రెండు హిందీ చిత్రాలు చేస్తున్నా. రెండు తమిళ, ఓ తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.