సాధారణంగా బాలీవుడ్ సినిమాలను కొన్ని దేశాల్లో తరచూ బ్యాన్ చేస్తూనే ఉంటారు. ఇందులో కొత్తేమీ లేదు. కానీ భారత్లో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలను విదేశాల్లో నిషేధించారు. వీటికి కారణం కొన్ని చిత్రాల్లో అశ్లీల సన్నివేశాలు ఉండటం ఓ కారణమైతే మరికొన్ని చిత్రాలు స్క్రీనింగ్ను దాటలేకపోయాయి. మరి మన దేశంలో మంచి విజయాన్ని అందుకుని విదేశీ ప్రేక్షకులకు చేరలేకపోయిన ఆ చిత్రాలేమిటో చూద్దామా!
ప్యాడ్మాన్
రుతుస్రావం సమయంలో వాడే సానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచి.. వాటిని అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురగనాథమ్ బయోపిక్గా 'ప్యాడ్మాన్' చిత్రం రూపొందింది. ఇందులో అక్షయ్కుమార్, సోనమ్కపూర్, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత్లో మంచి హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమాను విడుదల చేయడానికి పాకిస్థాన్ నిరాకరించింది. మహిళలు వాడే న్యాప్కిన్లపై సినిమా తీయడం వారి సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపిన పాకిస్థాన్ ఫెడరల్ సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు నో చెప్పేసింది.
ఓ మై గాడ్
దేవుడిని నమ్మని హీరో పరేశ్ రావల్ ప్రకృతి వైపరీత్యం వల్ల తన ఆస్తిని పొగొట్టుకొని వీధిపాలవుతాడు. ఆ సమయంలో బీమా సంస్థలకు డబ్బు చెల్లించాలని కోరగా దేవుడి చర్యవల్ల జరిగిన దానికి వారు చెల్లించేందుకు నిరాకరిస్తారు. తర్వాత హీరో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఆయనతోనే పోరాటం చేస్తాడు. అలా దేవుడి పేరు చెప్పుకు తిరిగే దొంగ బాబాల పని పడతాడు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రమే 'ఓ మై గాడ్'. ఇందులో దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపించాడు. తెలుగులో 'గోపాల గోపాల' పేరిట విడుదలైంది. దేశవ్యాప్తంగా మంచి హిట్ అయిన ఈ చిత్రాన్ని పలు మధ్య- తూర్పు దేశాలు నిరాకరించాయి. దేవుడిని నిందించడం అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని భావించిన ఆయా దేశాలు రిలీజ్కు నో చెప్పేశాయి. వీటిలో యూఏఈ కూడా ఉంది.
ది డర్టీ పిక్చర్
నటి సిల్క్ స్మితా జీవిత కథతో తెరకెక్కి మంచి విజయం దక్కించుకున్న 'ది డర్టీ పిక్చర్' చిత్రం విదేశాల్లోకి చేరుకోలేకపోయింది. ఈ సినిమాతో విద్యాబాలన్ నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో విద్యాబాలన్ పాత్ర ఇబ్బందికరంగా ఉందని భావించిన కువైట్ ఈ సినిమా విడుదలకు నిరాకరించింది.
దిల్లీ బెల్లీ
ఇమ్రాన్ ఖాన్, వీర్దాస్, కునాల్ రాయ్కపూర్లు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'దిల్లీ బెల్లీ'. ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాను నేపాల్లో బ్యాన్ చేశారు. ఇందులో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందున ఈ చిత్ర విడుదలపై ఆంక్షలు విధించారు. నేపాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందనే కారణంతో అక్షయ్ కుమార్ నటించిన 'చాందిని చౌక్ టూ చైనా'ను కూడా నిషేధించారు.
బొంబాయి
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'బొంబాయి' సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రెండు వేరు వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం ముఖ్యాంశంగా సాగుతుంది ఈ సినిమా. దీని వల్ల మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని భావించిన సింగపూర్ ప్రభుత్వం.. ఈ చిత్రాన్ని తమ దేశంలో నిషేధించింది.
ఫిజా
హృతిక్ రోషన్, కరిష్మా కపూర్, అమన్ ఇక్రముల్లా, జయాబచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫిజా' సినిమా ఓ కల్పితక థాంశంతో రూపొందింది. ఇందులో హృతిక్ రోషన్ ఓ మధ్య తరగతి ముస్లిం కుర్రాడిగా కనిపించాడు. ఆర్థికంగా ఎదిగేందుకు ఇంటినుంచి పారిపోతాడు. అయితే ఈ సినిమా ఓ ముస్లిం తీవ్రవాది కాదని చూపిస్తుంది. ఈ సినిమాను మలేసియా బ్యాన్ చేసింది.
బేబీ
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'బేబీ' చిత్రం మంచి విజయం దక్కించుకున్నప్పటికీ.. పాకిస్థాన్లో ఈ సినిమా విడుదలకు నిరాకరించింది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే ఓ పాకిస్థాన్ తీవ్రవాదిని పట్టుకునేందుకు హీరో దుబాయ్లో ఓ రహస్య మిషన్లో భాగస్వామిగా ఉంటాడు. పాకిస్థాన్ను అలా చూపించారనే కారణంతో అక్కడి సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలపై ఆంక్షలు విధించింది.
రాంఝానా
ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య సాగే రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాంఝానా'. ధనుష్, సోనమ్ కపూర్ హీరోహీరోయిన్లు. ఈ సినిమా మన దేశంలో మంచి విజయం దక్కించుకుంది. అయితే హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమించుకోవడం ఏమిటని భావించిన పాకిస్థాన్.. ఈ సినిమా విడుదలకు నిరాకరించింది.
ఏజెంట్ వినోద్
సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన 'ఏజెంట్ వినోద్' సినిమా సూపర్ హిట్ అయింది. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమాపై పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఆంక్షలు విధించింది.
తేరే బిన్ లాడెన్
'తేరే బిన్ లాడెన్' సినిమాను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. మనీశ్ పౌల్, సికేందర్ ఖేర్, ప్రధుమన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అమెరికా రహస్య మిషన్ ద్వారా చంపిన అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్.. వివాదాస్పద సమస్య ఆధారంగా తెరకెక్కింది. అందుకే పాకిస్థాన్ ఈ సినిమా విడుదలను నిరాకరించింది.
బంగిస్థాన్
'బంగిస్థాన్' సినిమా ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదుల కథాంశంతో రూపొందింది. ఈ కథ పాకిస్థాన్కు అభ్యంతరకరంగా ఉండడం వల్ల ఈ చిత్రం విడుదలకు పాక్ నిరాకరించింది.
ఉడ్తా పంజాబ్
'ఉడ్తా పంజాబ్' ఈ సినిమా పేరు విషయంలోనే అనేక వివాదాల్లో నిలిచింది. షాహిద్ కపూర్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాలో అసభ్యకర పదజాలం వాడటం, పాకిస్థాన్ నుంచి మాదకద్ రవ్యాలను తీసుకొచ్చి పంజాబ్లో ఓ యువకుడు విక్రయిస్తున్నాడనే కారణంతో పాకిస్థాన్ సినిమా రిలీజ్పై ఆంక్షలు విధించింది.
నీర్జా
ఎయిర్ హోస్టస్(గగనసఖి) నీర్జా నిజ జీవిత కథతో రూపొందింది ఈ సినిమా. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఓ విమానాన్ని తమ అదుపులోకి తీసుకోగా అందులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు నీర్జా తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. ఈ సినిమాను పాకిస్థాన్లో బ్యాన్ చేశారు.
డిషుమ్
భారత బ్యాట్స్మాన్ అదృశ్యమైన కథాంశంతో రూపొందిన సినిమా 'డిషుమ్'. వరుణ్ ధావన్, జాన్ అబ్రహమ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఉన్న కామెడీ అభ్యంతరకరంగా ఉందని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. అంతే కాకుండా తమ దేశాన్ని తక్కువ చేసి చూపించారని ఆరోపించింది.
ఫాంటమ్
సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'ఫాంటమ్'. ఇందులో పాకిస్థాన్ మాస్టర్మైండ్ హఫీజ్ సైద్ను ముంబయి దాడుల్లో సంబంధం ఉన్నట్లు చూపించారనే కారణంతో.. సినిమా విడుదలకు నిరాకరించింది పాక్ సెన్సార్.
ఇదీ చదవండి: బాలయ్యతో 'ఆర్ఎక్స్100' భామ రొమాన్స్!