మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్ గ్రామానికి చెందిన సత్యాధావన్ది పాలవ్యాపారం. అతను పెద్దగా చదువుకోలేదు. అందుకే తన కూతురు శ్రద్ధాధావన్, కొడుకు కార్తీక్లను బాగా చదివించాలనుకున్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన అనారోగ్యంతో అతని పాలవ్యాపారం కుంటుపడింది. చూసేవాళ్లు లేకపోవడంతో ఒక్క పశువుని మాత్రం తన వద్ద ఉంచుకుని, తక్కిన వాటిని అమ్మేశాడు. చూస్తుండగానే కుటుంబ పోషణతోపాటూ పిల్లల చదువులూ అతనికి భారంగా మారాయి. తన తర్వాత తన కుటుంబాన్ని, ఉన్న చిన్నపాటి పాలవ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆ సమయంలో అతని కళ్ల ఎదురుగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే శ్రద్ధాధావన్ కనిపించింది. ‘అమ్మా... నువ్వు మన పాలవ్యాపారాన్ని చూసుకోగలవా?’ అని తండ్రి అడగ్గానే ఉత్సాహంగా ఊఁ కొట్టిందా పిల్ల. అప్పటికి ఆ చిన్నారి వయసు 11 ఏళ్లే. అయినా పరిస్థితులను అర్థం చేసుకుని పశువుల కొట్టంలోకి అడుగుపెట్టింది.
వ్యాపారం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పసివయసులో తండ్రిని అడిగి ఎన్నో విషయాలు శ్రద్ధగా అడిగి తెలుసుకునేది. కొట్టాన్ని శుభ్రం చేయడం, పాలు తీయడం వంటి పనులని శ్రద్ధగా చేసేది. సైకిల్పై పాలకేంద్రాలకు పాలను తరలించేది. పశువులకు ఆరోగ్య సమస్యలొస్తే పశువైద్యులను సంప్రదించేది. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియపద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే వాటికి ఆహారంగా వేసేది. దాంతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చేవి. దాంతో మిగిలిన పాలను గ్రామంలో అవసరమైనవారికీ అమ్మేది. బాధ్యతలు పెరిగేసరికి సైకిల్ని వదిలి బైకు నడపడం నేర్చుకుంది.
రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం..
గ్రామంలో బైకుపై తిరుగుతూ పాలను విక్రయించే మొదటి ఆడపిల్ల అయ్యింది శ్రద్ధా. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. స్కూల్కు ఒక్కసారికూడా గైర్హాజరు అయ్యేదికాదు. హోంవర్క్కు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ పని పూర్తిచేసేది. శ్రద్ధా తమ్ముడు ఆమె కన్నా నాలుగేళ్లు చిన్నోడు. ‘నేను బాగా చదివితేనే, వాడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటాడు. అందుకే ఓవైపు పాలవ్యాపారాన్నీ, మరోవైపు చదువును సమన్వయం చేసుకుంటున్నాను. ప్రస్తుతం డిగ్రీ పాసయ్యా. ఫిజిక్స్ అంటే ఇష్టం. అందుకే ఈ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నా. నా చేతిలోకి ఈ పాలవ్యాపారం వచ్చేసరికి నా వయసు 11 ఏళ్లే. అప్పటికి మా పశువుల కొట్టంలో ఒక్క పశువు మాత్రమే ఉండేది. ఇప్పుడు 80 వరకు ఉన్నాయి. వీటికోసం రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం నిర్మించా. మా గ్రామంలోని రైతుల నుంచి సేంద్రియపద్ధతిలో పండించే గడ్డినే పశువులకు ఆహారంగా తీసుకుంటా. ఈ పదేళ్లలో అనుభవంతోపాటూ ఎన్నో మెలకువలనూ తెలుసుకున్నా. మావూర్లో అందరూ చదివి, పట్నాలకు వెళుతున్నారు. నేను మాత్రం ఈ పాలవ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తా. త్వరలో పాల ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలనుకుంటున్నా. ఈ రంగంలో అడుగుపెట్టినందుకు నేను సిగ్గుపడటం లేదు. కుటుంబ బాధ్యతలను కాస్తంత ముందుగా తీసుకున్నా అంతే. ఇప్పుడు మా డైయిరీ నుంచి రోజుకి 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. వీటిని తరలించడానికి జీపు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా. నెలకు ఆరులక్షల రూపాయల ఆదాయం వస్తోంది. యువత ఈ పరిశ్రమలోకి అడుగుపెడితే మరిన్ని విజయాలు సాధించొచ్చు. ఈ రంగంపై అందరికీ అవగాహన కలిగించేదిశగా ఆన్లైన్లో పలు సంస్థల తరఫున అతిథిగా ప్రసంగిస్తున్నా’ అని చెబుతోంది శ్రద్ధాధావన్.
- ఇదీ చూడండి : యువ రచయిత శరణ్య మణివన్నన్.. ఎంతో మందికి స్ఫూర్తి..