అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో వేలాది మంది ఇరానియన్లు పాల్గొన్నారు. సులేమానీ స్వస్థలమైన కర్మన్లో ఆయన అంతిమయాత్ర జరిగింది. ఆయనకు ప్రజలంతా కన్నీటి నివాళులర్పించారు.
గత శుక్రవారం బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా చేసిన డ్రోన్ దాడిలో సులేమానీ చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఓ వైపు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అంటుంటే.. దాడికి పాల్పడితే కనీవినీ ఎరుగని రీతిలో సమాధానం చెప్తామని ట్రంప్ హెచ్చరించారు.
వారంతా ఉగ్రవాదులే....
అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని పదేపదే చెబుతున్న ఇరాన్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. సులేమానీ మృతికి కారణమైన అగ్రరాజ్య సైనికులు అందరినీ ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి: రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు