ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు చేసిన మెరుపుదాడుల్లో.. 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సహేల్ ప్రాంతంలో మిలటరీ కాన్వాయ్పై జరిగిన ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ దాడికి కారణమైన వారికోసం సాయుధ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అక్కడి అధికార ప్రతినిధి చెప్పారు.
వారం రోజుల్లోనే రెండోది..
అంతకముందే ఔదాలన్ సమీప నగరమైన గోరోమ్లో సుమారు 20మంది ముష్కరులు మోటార్బైకులతో దాడిచేసి ఓ బార్కు నిప్పంటించారట. అనంతరం అక్కడి వారిని భయపెట్టినట్టు తెలుస్తోంది. తాజా ఘటనతో బుర్కినా ఫాసోలో వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో దాడి.
ఈ నెల 22న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ తరహా ఘటనలు జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
అల్ ఖైదా, ఇస్లామిక్ దేశాలతో ముడిపడి ఉన్న తీవ్రవాద హింస.. పశ్చిమాఫ్రికా అంతటా వ్యాపించింది. ఈ హింసల కారణంగా ఈ ఏడాది సుమారు 2వేల మందికిపైగా మృతిచెందారు.
ఇదీ చదవండి: ఘానాలో చర్చి కూలి 22 మంది మృతి