హైదరాబాద్ ఉప్పల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా రద్దీ వాతావరణం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో ప్రాంగణంలోకి అడుగు పెట్టేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. కరోనా నిర్ధరణ పరీక్షలు మినహా.. మిగతా అన్ని సేవలు స్థానికంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
మరోవైపు టీకాల కోసం జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు రకాల టీకాలు అందుబాటులో ఉండటంతో స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారూ వ్యాక్సిన్ కోసం ఇక్కడికి తరలివస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 600 మందికి పైనే టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వారందరి వివరాలను ఆన్లైన్లో ఒకే కంప్యూటర్ ద్వారా నమోదు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ తీవ్ర ప్రవాసనంగా మారింది. ఆన్లైన్ నమోదుకు గంటల తరబడి వరుసలో నిరీక్షించాల్సి వస్తుండటంతో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడికి వచ్చే వారు కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మరోవైపు బీరప్పగడ్డలోని మోడల్ మార్కెట్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారిని మందుల కోసం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తున్నారు. దీంతో వారంతా ఇక్కడ బారులు తీరుతున్నారు. ఈ విషయం తెలియక వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు సైతం పాజిటివ్ వచ్చిన వారి వరుసల్లో నిల్చుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి..'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి?