దశాబ్దాల నిర్లక్ష్యం, వెనకబాటుతనాన్ని అధిగమించి తెలంగాణ అనేక రంగాల్లో పురోగమిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో వినూత్న, ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ తీసుకొచ్చిందన్నారు. ప్రపంచస్థాయి కంపెనీల నుంచి రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించిందని, హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని తెలిపారు. భాగ్యనగరం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా మారుతుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం మొదటి ఐదు రాష్ట్రాల్లో ఉండడం కొత్త రాష్ట్రానికి గొప్ప విజయమని అన్నారు. కొవిడ్ను సమర్థంగా నివారించడమే కాకుండా... తక్కువ పాజిటివిటీ, మరణాల రేటు ఎక్కువ రికవరీ రేటుతో తెలంగాణ ముందుందన్నారు. కొవ్యాగ్జిన్ హైదరాబాద్ నుంచి రావడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఐటీ, నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్, మంచినీటి సరఫరా రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, హరిత హారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు.
అవినీతికి ఆస్కారం లేని తరహాలో, పారదర్శకంగా, సులువుగా సేవలు అందేలా కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని గవర్నర్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే పెద్దదైన బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టుగా పరిగణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటి నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగైందని, భారత ఆహార సంస్థ సేకరించిన ధాన్యంలో 55 శాతం వాటాతో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని వివరించారు. బంగారు తెలంగాణ లక్ష్యసాధన కోసం అభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వం దిశగా రాష్ట్రం పయనిస్తోందని ప్రకటించారు.
ఇదీ చూడండి: ఎన్సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ