అలనాటి సినీ కథానాయకుడు పైడి జయరాజ్ పేరును సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిపేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన.. జయరాజ్ 111వ జయంతి కార్యక్రమంలో మంత్రి గంగులతో కలిసి పాల్గొన్నారు.
పైడి జయరాజ్ చిత్రపటానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పైడి జయరాజ్ దేశంలో గుర్తింపు పొందారు కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయనను పట్టించుకోలేదని మంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన వైతాళికులను గుర్తించి సీఎం కేసీఆర్ వారిని సత్కరించారని తెలిపారు.