BJP demands CBI inquiry on Lepakshi lands scam లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు ఏపీ భాజపా డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని భాజపా నేతలు ఆరోపించారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్గా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
కేవలం 500 కోట్లకే నాలుగు వేల రెండొందల ఎకరాలు భూమిని ఒక ప్రైవేట్ సంస్థ చేజిక్కించుకోవడం అతిపెద్ద స్కామ్. ప్రజల సొమ్మును బ్యాంకు లోన్లకు ప్రైవేట్ సంస్థ వాడుకోవడం ఏంటి? ఏపీ ఒక సాఫ్ట్వేర్ హబ్గా మారేందుకు కేటాయించిన భూమి అది. ప్రత్యక్షంగా నేను వెళ్లి చూశా. ఈ ఏడాది ఏప్రిల్లో భూములు ఇచ్చారని చెబుతున్నారు. ఈ స్కామ్లో అధికార పార్టీకి సంబంధం లేదని చెప్పలేం. -జీవీఎల్, రాజ్యసభ ఎంపీ
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ..: అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా.. కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.
పథకాలు నిలిపివేత: భాజపా సభ్యులని తెలియగానే రాష్ట్రంలో పథకాలు తీసేస్తున్నారు జీవీఎల్ ఆరోపించారు. రేషన్ కార్డుల, పింఛన్ తొలగిస్తున్నారన్నారు. భారీగా ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కావాలని జాబితా నుంచి తొలగించారని.., దీన్ని పర్యవేక్షించాలని ఎలక్షన్ కమిషన్ను కోరినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు రుజువైతే చర్యలు చేపట్టాలన్నారు. లిక్కర్ స్కామ్పై దిల్లీలో డొంక కదిలితే తెలుగు రాష్ట్రాల్లో అలజడి మెుదలైందని జీవీఎల్ అన్నారు. రెండు అధికార పక్షాలకు సంబంధమున్నట్లు సమాచారముందని ఆరోపించారు.
ఆ భూములు వెనక్కి తీసుకోండి: అమరావతిలో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ యాగీ చేసి కేసులు పెట్టిన వైకాపా ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను లేపాక్షిహబ్కు కట్టబెట్టిన వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. భూముల అప్పగింత వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. జనం కళ్లకు గంతలు కట్టి జగన్ మేనమామ కుమారుడు ఆ భూములు తన్నుకుపోతున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: Lepakshi Lands Issue లేపాక్షి భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు
కవిత పరువు నష్టం కేసులో ఆ ఇద్దరికి కోర్టు నోటీసులు
సీఎం సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు, నగదు కోసం వెళ్తే బయటపడ్డ ఏకే47 రైఫిళ్లు