నారదా కుంభకోణం కేసులో టీఎంసీ మంత్రులు, ఇతర నేతలను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తృణమూల్ జెండాలను పట్టుకొని సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు రంగంలోకి దిగారు. సీబీఐ కార్యాలయం ఉన్న నిజాం ప్యాలెస్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని కార్యకర్తలు దాటే ప్రయత్నం చేయడం వల్ల.. అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఆర్పీఎఫ్తో పాటు కోల్కతా నగర పోలీసులు సైతం మోహరింపులు చేపట్టారు.
అంతకుముందు.. పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్న వెంటనే బంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
ఏంటీ నారదా కుంభకోణం?
కల్పితంగా సృష్టించిన కంపెనీల ప్రతినిధుల నుంచి లంచం తీసుకుంటున్నారనే అభియోగాలతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 2017 మార్చిలో దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.
నారదా టీవీ ఛానెల్ 2014లో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. టీఎంసీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు ఈ ఆపరేషన్ చేపట్టిన మ్యాథ్యూ శ్యామ్యూల్ పేర్కొన్నారు. వీరు డబ్బు తీసుకుంటున్న వీడియో 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బయటకు విడుదలైంది.
ఇదీ చదవండి: 'దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోదీ'