గుజరాత్లోని మోర్వా హాడాఫ్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రికా బరియా స్థానికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భాజపా అభ్యర్థుల ఇళ్లపై రాళ్లు రువ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గెలిచిన అభ్యర్థులు ఈవీఎంలను ఉపయోగించి బోగస్ ఓట్లతో గెలిచినట్లు ఆరోపించారు చంద్రిక. ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎన్నికల్లో మద్యాన్ని విచ్చలవిడిగా పంచారని తెలిపారు. అడ్డదార్లు తొక్కి గెలిచిన వారి ఇళ్లపై రాళ్లు రువ్వి సరైన సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా ఇరుపార్టీల మధ్య వివాదానికి దారి తీశాయి.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు చంద్రిక. తనను ఓడించాలంటే ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని తెలిపారు.
'పోలీసు వ్యవస్థ దుర్వినియోగం'
గుజరాత్లో భాజపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చౌడా ఆరోపించారు. భారీగా అవినీతికి పాల్పడిన కమలదళం ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆ డబ్బును ఖర్చు చేస్తోందన్నారు. ఇందుకు సాయంగా పోలీసులను, అధికారులను వారి స్వలాభం కోసం ఉపయోగించుకుంటోందని తెలిపారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే వ్యూహాలపై నాయకులతో చర్చించారు అమిత్.
కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపేంద్ర కాంత్ మరణంతో మోర్వా హడాఫ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఏప్రిల్ 17 న ఈ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది.