తౌక్టే తుపాను మహారాష్ట్రలోని తీరప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 11మంది మరణించారు. 12వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 15వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కొంకణ్ తీర ప్రాంతంలో 300లకు పైగా గ్రామాలు తుపాను బీభత్సానికి దెబ్బతిన్నట్లు తెలిపారు.
రాయ్గఢ్లో తుపాను విధ్వంసం
తుపాను ధాటికి రాయ్గఢ్ జిల్లాలో నలుగురు మృతి చెందారు. 5,244 ఇళ్లు ధ్వంసం కాగా ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుపాను బీభత్సానికి రాయ్గఢ్ జిల్లావ్యాప్తంగా దాదాపు 5వందలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు జిల్లా కలెక్టర్ నిది చౌదరీ తెలిపారు. దీంతో అలీబాగ్, మురుద్ ప్రాంతాల్లో 30గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 8,383 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
రత్నగిరిలో తౌక్టే బీభత్సం..
తుపాను ప్రభావానికి రత్నగిరి జిల్లాలో ఇద్దరు కూరగాయల వ్యాపారులు మరణించగా ఎనిమిది మంది గాయపడ్డట్లు.. 1028 ఇళ్లు ధ్వంసమైనట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు.