దేశంలోని కొన్ని వ్యాపార సంస్థలు కరోనా టెస్టింగ్ కిట్లను ఎక్కువ ధరకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నాయని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కరోనా సంక్షోభంలోనూ ఇలా చేయడం సిగ్గుచేటని మండిపడింది. కరోనా టెస్టింగ్ కిట్లను రూ.225కు కొనుగోలు చేసిన ఓ సంస్థ.. భారత వైద్య పరిశోధన మండలికి రూ.600కు విక్రయిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఆరోపించారు. అదే సంస్థ తమిళనాడు ప్రభుత్వానికి ఒక్కో కిట్ను రూ.400కి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తివారీ డిమాండ్ చేశారు. పీపీఈ, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల వంటి కరోనా పరికరాల కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగం చేయాలన్నారు. వీటి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండాలన్నారు. దిల్లీ హై కోర్టులో ఓ సంస్థ పిటిషన్ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
మోదీ జోక్యం చేసుకోవాలి...
కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్ల సరఫరాలో అవినీతి జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టింగ్ కిట్లను 150శాతానికి పైగా లాభాలతో విక్రయిస్తున్నారని ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చూపారు రాహుల్.
"యావత్ దేశం కరోనా విపత్తుపై పోరాడుతున్న సమయంలో కొంతమంది దీనిని కూడా వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు. అలాంటి అవినీతి ఆలోచనలు కలిగి ఉన్నందుకు సిగ్గుపడాలి. కరోనా కిట్లతో లాభాలు ఆర్జిస్తున్న వారిపై ప్రధాని మోదీ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని దేశం ఎప్పటికీ క్షమించదు."
-రాహుల్ గాందీ
కరోనా టెస్టింగ్ కిట్లతో లాభాలు పొందాలని చూడటం సిగ్గుచేటు, అమానవీయం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా విమర్శించారు. ప్రధాని మోదీ సమస్యను పరిష్కరిస్తారా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.