దేశ రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వినూత్న పోకడల ద్వారా రాజ్యాంగాన్ని పటిష్ఠపరిచేందుకు ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. దేశ ప్రజల హక్కులను పరిరక్షించడంలోనైనా.. జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తినా.. న్యాయ వ్యవస్థ ప్రతిసారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని కొనియాడారు.
గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలకు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ప్రధాని మోదీ. గుజరాత్ హైకోర్టు నెలకొల్పి 60 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. దేశ సంస్కృతిలో 'సమన్యాయ పాలన' అనేది ప్రాథమిక సూత్రంగా పనిచేసిందని అన్నారు.

"శతాబ్దాలుగా.. దేశ సంస్కృతిలో 'సమన్యాయ పాలన' అనేది ప్రాథమిక సూత్రంగా వ్యవహరించింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని పటిష్ఠం చేసిన 'స్వరాజ్య'మనే భావన సైతం అక్కడి నుంచి ఉద్భవించింది. రాజ్యాంగకర్తలు కూడా దీనికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. భారత సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమన్యాయ పాలన.. ప్రతి పౌరుడి హక్కు. అందువల్ల ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను నెలకొల్పడం అవసరం. ఇది ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థల బాధ్యత."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వ్యాజ్యాలను విచారించడంలో సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలిపారు మోదీ. ఇది మనకు గర్వకారణమని అన్నారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు సైతం కరోనా సమయంలో భారీగా ఆన్లైన్లో వాదనలు విన్నాయని గుర్తు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా వాదనలు వినడంలో గుజరాత్ హైకోర్టు రికార్డు నెలకొల్పిందని చెప్పారు. లాక్డౌన్లో కోర్టు తీర్పులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని తెలిపారు. కోర్టు విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసిన తొలి హైకోర్టుగా గుజరాత్ అత్యున్నత న్యాయస్థానం నిలిచిందన్నారు.
కోర్టుల్లో కృత్రిమ మేధ
న్యాయ వ్యవస్థను భవిష్యత్ కోసం సిద్ధం చేసేందుకు కృత్రిమ మేధ ఉపయోగాన్ని గణనీయంగా పెంచాలని పిలుపునిచ్చారు మోదీ. న్యాయ వ్యవస్థ సమర్థతను, వేగాన్ని పెంచేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ఈ దిశగా పురోగమించడానికి 'ఆత్మనిర్భర్ భారత్' సంకల్పం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సులభతర న్యాయంతో పాటు, సులభతర జీవనాన్ని ప్రోత్సహించేలా.. క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.