ఐదునెలలుగా వాఘా సరిహద్దు వద్ద ఉన్న సంఝౌతా ఎక్స్ప్రెస్ బోగీని తిరిగి పంపించాలని పాకిస్థాన్ను కోరింది భారత్. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలు నిలిచిపోయాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ విషయంపై పాక్కు విజ్ఞప్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత భద్రతాపరమైన కారణాలు చూపుతూ.. వాఘా సరిహద్దు వద్ద గతేడాది ఆగస్టు 8న సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపేసింది దాయాది దేశం. ఆ సమయంలో దాదాపు 117 మంది ప్రయాణికులు రైలులో ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అటారికి చేరుకోవాల్సిన ఈ రైలు... భారతీయ రైల్వే అధికారులు ఇంజిన్, సిబ్బందిని పంపిస్తే సాయంత్రం 5.15 గంటలకు వాఘా నుంచి అటారికి చేరుకుంది.
ఆరునెలల ఒప్పందం
సంఝౌతా ఎక్స్ప్రెస్ కోసం కోచ్లను ఉపయోగించేందుకు ఇరు దేశాలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు పాక్ రేక్లను ఉపయోగిస్తే.. జులై నుంచి డిసెంబరు వరకు భారత్ రేక్లను ఉపయోగిస్తుంది. సాధారణంగా రేక్లు ఎప్పటికప్పుడు స్వదేశానికి తిరిగొస్తాయి. కానీ ఐదునెలల వరకు ఓ బోగీ ఇరు దేశాల మధ్య చిక్కుకోవడం ఇదే తొలిసారి.