మైసూర్ పాక్... ఈ తీపి వంటకమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. క్షణాల్లో లాగించేస్తారు. అయితే.. ఈ ప్రసిద్ధి చెందిన మిఠాయి గుర్తింపుపై వివాదాలు నెలకొన్నాయి.
మైసూర్ పాక్ తమిళనాడుకు చెందిందని... ప్రముఖ రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించాయి. రంగనాథన్ ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే.. మైసూర్లోని ప్రముఖ గురూ స్వీట్ షాప్ యజమాని నటరాజ్ దీనిపై స్పందించారు. మైసూర్ పాక్ చరిత్ర, దాని ఆవిర్భావం గురించి ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
''మైసూర్ పాక్ తొలుత మైసూర్లో మాత్రమే ఉండేది. రాజప్రాసాదంలో వంటమనిషిగా ఉన్న మా ముత్తాత.. రాజుగారికోసం అన్ని తీపివంటకాలు వండిపెట్టేవారు. రోజూ ఇవే వంటకాలా.. ఏవైనా కొత్తవి చేయొచ్చుగా అని రాజుగారు అడిగారు. అదే రోజు మా తాత చక్కెరతో పాకం పట్టించి తీపి వంటకం తయారు చేశారు. రాజుకు ఆ మిఠాయి ఎంతో నచ్చింది. దాని పేరేంటని అడగ్గా.. 'మీరు ఆదేశించారు నేను చేశాను... నాకు పేరు తెలియదని' మా తాత అన్నారు. అప్పుడా రాజు.. ఇది మైసూర్లో మాత్రమే తయారైంది కాబట్టి మైసూర్ పాక్ అని పిలవడం ప్రారంభించారు. ఈ మైసూర్ పాక్కు మైసూర్తో మాత్రమే సంబంధముంది. ఇతర రాష్ట్రాలతో కాదు.''
- నటరాజ్, గురూ స్వీట్ షాప్ యజమాని.
కాలమిస్ట్ ఆనంద్ రంగనాథన్... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఉన్న ఫొటో జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేయడమే ఈ వదంతులకు కారణమైంది. అనంతరం... పెద్ద గందరగోళం తలెత్తింది.
''మైసూర్ పాక్ జీఐ(భౌగోళిక గుర్తింపు) ట్యాగ్ను తమిళనాడుకు మంజూరు చేసినందుకు ఏక సభ్య కమిటీ తరఫున ఈ ప్రశంసల టోకెన్ను స్వీకరించడం ఆనందంగా ఉంది. దీనిపై ప్రశాంతంగా చర్చలు సాగుతున్నాయి'' అనేది ఆ ట్వీట్ సారాంశం.
ఆనంద్ చేసిన ఈ ట్వీట్.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. తమిళనాడు మైసూర్పాక్కు భౌగోళిక గుర్తింపు వచ్చిందన్న వార్తలకు కారణమైంది. ఇదే కర్ణాటక వాసులకు ఆగ్రహం తెప్పించింది.