జమ్ముకశ్మీర్లో స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35-ఏ అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం రేపటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యాలపై ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఆర్టికల్ 35-ఏ ఏంటి?
జమ్ముకశ్మీర్లో శాశ్వత పౌరులను గుర్తించి, వారికి ప్రత్యేక హక్కులను కల్పించే అధికారాన్ని రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చేందుకు 35-ఏ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
ఆర్టికల్ ఏం చెబుతోంది.?
ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి వీలు లేదు. శాశ్వత హోదా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులు.
వివాదం ఏంటి.?
1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 35-ఏ అధికరణాన్ని రాజ్యాంగంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే పార్లమెంట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఈ అధికరణాన్ని చేర్చడంపై వివాదం మొదలైంది.
ఈ అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న నేతలతో పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టరూపం దాల్చాలని పిటిషనర్లు పేర్కొన్నారు.