దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఉందని అంగీకరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. "విద్య- దశ, దిశ" పేరిట దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఉద్యోగ సృష్టి విషయంలో భారత్, చైనా మధ్య అంతరాల్ని గణాంకాలతో వివరిస్తూ... కేంద్రంపై మాటల దాడి చేశారు రాహుల్.
రఫేల్, అవినీతి, ఉపాధి, ఇతర అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని మోదీకి ఇప్పటికే సవాలు విసరడాన్ని గుర్తుచేశారు రాహుల్. నిరుద్యోగం సమస్యపై కనీసం యువతతోనైనా ప్రధాని చర్చించాలని సూచించారు.
విద్యా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు రాహుల్.
గత ఐదేళ్లలో 15-20 మంది పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.3.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రూ.3.5లక్షల కోట్లంటే తెలుసా? దశాబ్దకాలం ఉపాధి హామీని నడపవచ్చు. ఆ నిధులతో లక్షల మంది విద్యార్థులు బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. భారత్లో సంపద కేంద్రీకృతం అవుతోంది. ఆ 15-20 మంది పారిశ్రామికవేత్తల కోసం ప్రైవేటీకరణ జరుగుతోంది. ప్రభుత్వం మీ చదువుల కోసం చెల్లించదు. మీరే చెల్లించాలి. ఆ చెల్లించిన మొత్తాలు ఆ 15-20మంది చేతుల్లోకి వెళ్తాయి. మేం దీనికి వ్యతిరేకం. మేం అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థకు అధికంగా నిధులు కేటాయిస్తాం. మేం అధికారంలో ఉన్నప్పటితో పోల్చితే విద్యా వ్యవస్థకు కేటాయించే మొత్తాల్లో భారీ కోతను మీరు గమనిస్తారు. --రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు