కడప జిల్లాలోని 40వ నంబర్ జాతీయ రహదారిలో (ఎన్హెచ్-40) కడప-రాయచోటి మార్గంలో ఉన్న గువ్వలచెరువు ఘాట్ లో రహదారి ప్రమాదాలు నివారించడానికి జాతీయ రహదారుల విభాగం సొరంగ మార్గం తవ్వాలని కేంద్ర రహదారులు, భవనాల మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఫలితంగా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేయడానికి అనుమతి వచ్చింది. ఈ మేరకు గువ్వలచెరువు ఘాట్ లో సొరంగ మార్గం తవ్వడానికి కావాల్సిన అంచనాలు తయారు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 211/500 కిలోమీటరు నుంచి 217/200 కిలోమీటర్ వరకు సొరంగ మార్గం తవ్వాలని ప్రతిపాదించారు.
టెండర్ దాఖలు చేయాలి
దాదాపు 6 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని గువ్వలచెరువుఘాట్ లో తవ్వితే వాహనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని జాతీయ రహదారుల విభాగం భావిస్తోంది. ముందుగా సొరంగ మార్గాన్ని తవ్వేందుకు గత ఏడాది కడప జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. సొరంగ మార్గాన్ని తవ్వేందుకు కావాల్సిన అంచనాలు రూపొందించడానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. డీపీఆర్ తయారు చేయడానికి ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆ కన్సల్టెన్సీని ఎంపిక చేయడానికి జాతీయ రహదారుల విభాగం అధికారులు టెండర్లు పిలిచారు. జాతీయ రహదారుల విభాగం అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం నుంచి మార్చి 22న టెండర్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మే నెల 10వ తేదీలోపు ఆసక్తి కల్గిన ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీలు టెండర్ దాఖలు ఆన్లైన్లో చేయాల్సి ఉంది.
సొరంగ మార్గం తవ్వాలంటే..
మే 10వ తేదీన టెండర్లు దాఖలు పూర్తి చేయగానే 11వ తేదీ బిడ్లు తెరిచిన తర్వాత... టెండర్ దక్కించుకున్న కంపెనీ సామర్థ్యం, చరిత్ర తెలుసుకుని డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కడప నుంచి రాయచోటికి వెళ్లే ఎన్హెచ్-40 మార్గంలో గువ్వలచెరువు ఘాట్ లో 8 వరకు మలుపులు ఉన్నాయి. వీటిలో కడప వైపు నుంచి ఆరు మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. కడప వైపు నుంచి ఘాట్ ఎక్కే ప్రదేశం నుంచి 8 మలుపులు దాటుకుని గువ్వలచెరువు ఘాట్ దిగే వరకు దాదాపు 150 మీటర్ల ఎత్తు వరకు వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సొరంగ మార్గం తవ్వాలంటే... 150 మీటర్లను తగ్గించి... కింది నుంచి వలయాకారంలో సొరంగ మార్గం తవ్వాలనేది జాతీయ రహదారుల విభాగం అధికారుల ప్రతిపాదన.
అనువుగా ఉంటుందా?
అయితే టెండర్ దక్కించుకున్న తర్వాత కన్సల్టెన్సీ ఏజెన్సీ ఘాట్ ప్రాంతాన్ని పరిశీలించి.. ఇక్కడి మట్టి, రాళ్లను పరీక్షించడం అన్ని చేస్తారు. సాంకేతికంగా ఏ విధంగా టన్నెల్ పూర్తి చేయాలనేది కూడా అధ్యయనం చేస్తారు. ఘాట్ ఉండగానే కింది వైపు నుంచి సొరంగ మార్గం తవ్వడానికి అనువుగా ఉంటుందా? అనే అంశంపై పూర్తిస్థాయిలో డీపీఆర్ తయారు చేయడానికి కన్సల్టెన్సీకి కనీసం 6 మాసాల సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల భావన. డీపీఆర్ను పరిశీలించిన తర్వాతనే కేంద్ర జాతీయ రహదారుల విభాగం అనుకూలంగా ఉంటే.. సొరంగ మార్గం తవ్వడానికి నిధులు కేటాయించే వీలుంది. సొరంగమార్గంలో నాలుగు వరసల రహదారి ఉండే విధంగా అంచనా వేయనున్నారు.
40 నంబర్ జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్ వాహనాలకు చాలా అడ్డంకిగా ఉంది. కడప వైపు నుంచి బెంగళూరు, చిత్తూరుకు వెళ్లే అధికలోడు వాహనాలకు ఘాట్ చాలా ఇబ్బందిగా ఉంది. సమయం వృథా కావడంతో పాటు... అపుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాటిని నివారించాలంటే సొరంగమార్గమే సరైనదారిగా జాతీయ రహదారుల విభాగం భావిస్తోంది.
ఇదీ చదవండి: దువ్వాడ సెజ్లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం