కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో సర్వేనంబరు 506-బి, 507లో 104 ఎకరాల రిజర్వ్ అటవీ భూమి ఆక్రమణకు గురైందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. గత నెలలో మైదుకూరు తెదేపా ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్...ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. భూమి చుట్టూ కంచె వేయడంతో పాటు మామిడి మొక్కలు నాటడం, బోర్లు వేయడం, డ్రిప్ ఏర్పాటు చేయడం చేశారు. ఇదంతా వైకాపా నాయకుల పనేనని పుట్టా ఆరోపించారు. వైకాపా నాయకులు ఈ ఆరోపణలతో విభేదింస్తున్నారు. పట్టా భూమిని కొనుగోలు చేశామని వైకాపా నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వ మీ భూమి వెబ్సైట్లో 104 ఎకరాల భూమి రిజర్వు ఫారెస్టుగా కనిపిస్తోంది. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్... జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్లో అన్ని ఆధారాలతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను పొందుపరుస్తూ పిటిషన్ వేశారు.
పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి... ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కు నోటీసులు జారీచేశారు. ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న 104 ఎకరాల భూమి అటవీ సంరక్షణలోనే ఉందా... లేదా ఎవరైనా ఆక్రమించారా అనే వివరాలను సమగ్రంగా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 23వ తేదీ లోగా సమగ్ర వివరాలు పొందుపరచాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రతులు, వివరాలను పుట్టా సుధాకర్ యాదవ్ ఇవాళ కడపలో వెల్లడించారు. ప్రజాసంబంధమైన మంచి పనులకు భూమి అవసరమైతే అటవీశాఖ అనుమతులు నిరాకరిస్తుంది. అలాంటిది దాదాపు వంద ఎకరాలు పైగానే భూమిలో నాలుగు నెలల నుంచి కంచె వేసి, మామిడి మొక్కలు సాగు చేస్తూ ఉంటే అధికారులు కళ్లు మూసుకున్నారా అని తెదేపా కడప పార్లమెంటు ఇన్ఛార్జి లింగారెడ్డి ప్రశ్నించారు. వైకాపా నాయకులు స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
అటవీ భూమి ఆక్రమణలపై సమగ్ర వివరాలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కంచె వేసిన భూమిని పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆరు వారాల సమయం ఉండటంతో ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భూమి ఆక్రమణలపై అధికారులపై వేటు పడే వీలుందని తెదేపా నేతలు అంటున్నారు.
ఇదీ చదవండి : ప్రాణాలు బలితీస్తున్న ప్రేమోన్మాదం