తెలుగువారి పౌరుషం, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఒంగోలు ఆవులు ప్రపంచవ్యాప్తంగా పాడి ఉత్పత్తిలో ఢంకా బజాయిస్తున్నాయి. మన సొంత సంతతి విశిష్టతను మనం తెలుసుకునేలోపే... ఇక్కడి మేలు జాతి అంతా విదేశాలకు తరలిపోయింది. ప్రకృతి సేద్యం పుణ్యమాని... ఇప్పుడు ఒంగోలు ఆవులకు మంచి రోజులొచ్చాయి. అవసరం వచ్చింది కదాని కొందామంటే శ్రేష్ఠమైనవి దొరకడం లేదు. 9 నెలల దూడను కొనాలంటేనే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు అవుతోంది. ఆవులైతే రూ.40వేల పైమాటే. ఇక గిత్తలకు రూ.3లక్షల నుంచి రూ.50లక్షల వరకు పలుకుతోంది. సాధారణ రైతులకు వీటిని కొనడం అసాధ్యం కావడంతో... గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్థానంలో దేశవాళీ ఆవుల్ని పిండమార్పిడి విధానంలో అభివృద్ధి చేస్తున్నారు.
బ్రెజిల్లో 18 కోట్ల ఆవులు...
కృష్ణా నదికి దక్షిణాన, పెన్నాకు ఉత్తరాన గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ రకం సంతతి అభివృద్ధి చెందింది. 1900 సంవత్సరంలో ప్రతి రైతు ఇంట్లో నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులు, ఊరికి రెండు, మూడు శ్రేష్ఠమైన ఆబోతులుండేవి. 1875-1960 మధ్య కాలంలో నాణ్యమైన ఒంగోలు జాతి ఆవులు, ఆబోతుల్ని బ్రెజిల్, కొలంబియా, వెనెజువెలా, అమెరికా, ఆస్ట్రేలియా, జమైకా తదితర దేశాలకు తరలింపు మొదలైంది. ముఖ్యంగా 1961-62 మధ్య బ్రెజిల్ నుంచి ప్రత్యేక బృందం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు వచ్చి 107 ఆవులతోపాటు కొన్ని ఎద్దులు తీసుకెళ్లారు. ఇప్పుడక్కడ 18 కోట్ల ఒంగోలు జాతి ఆవులు ఉండటం గమనార్హం.
టెస్ట్ట్యూబ్ బేబీ విధానంపై ఆశలు...
ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండమార్పిడి సాంకేతికత ద్వారా దేశవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరులోని శ్రీవెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్థానం(లాం)లోని పిండోత్పత్తి జీవ సాంకేతిక ప్రయోగశాలను కేంద్ర పశుపాలన, డెయిరీ, మత్స్య పాలనావిభాగం గుర్తించింది. ఇక్కడ ఒంగోలు, పుంగనూరు, గిర్ ఆవుల అభివృద్ధి పథకాన్ని చేపట్టారు.
* సాధారణంగా.. ఒక ఆవు జీవితకాలంలో ఎనిమిది నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది. ఐవీఎఫ్, పిండమార్పిడి విధానంలో ఒక మేలు జాతి ఆవు నుంచి 50 నుంచి 100 పిండాలను ఉత్పత్తి చేసి, 30 నుంచి 40 దూడలను పొందవచ్చు.
* ఐవీఎఫ్ ప్రయోగాల్లో భాగంగా... మేలుజాతి ఆవుల నుంచి అపరిపక్వ మాతృ జీవకణాల్ని సేకరించి.. ఇంక్యుబేటర్లో మేలు జాతి ఆబోతు వీర్య కణాలతో సంపర్కం చేస్తారు. అనంతరం ఫలదీకరణం చెందిన పిండాలను అద్దె గర్భంలోనికి ఎక్కించడం ద్వారా అత్యుత్తమ జన్యు సంపద కలిగిన సంతతిని పుట్టిస్తారు.
* ఈ టెస్ట్ట్యూబ్బేబీ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు 600 వరకు ఉత్తమ జన్యు సంప్రదాయమున్న పిండాలను అభివృద్ధి చేసి భద్రపరిచారు. వీటిని శిక్షణ పొందిన పశువైద్యుల ద్వారా రైతులకు చెందిన ఆవుల్లో గర్భంలో... వారి ఇంటి వద్దనే ప్రవేశ పెడతారు.
ప్రకృతి సేద్యంలో ఒంగోలు ఆవు..
* ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ ఆవులే కీలకం. అందులో మనకే సొంతమైన ఒంగోలు జాతికి ఎంతో ప్రాధాన్యముంది. సగటున ఒక ఆవు రోజుకు 10-12 కిలోల పేడ, 5 నుంచి 6 లీటర్ల మూత్రాన్ని ఇస్తుంది. వీటితో తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వర్మి కంపోస్టు, పంచగవ్య, క్రాప్ టానిక్లను పంటల్లో తెగుళ్ల నివారణకు పిచికారీ చేస్తున్నారు. పేడతో సబ్బులు, దోమల నివారణ మందులు, అగరొత్తులు, పిడకలనూ తయారీ చేసుకోవచ్చు.
* దీర్ఘకాలిక రోగాల నివారణకు దేశవాళీ పాల(ఏ2)ను ఉపయోగిస్తారు. లీటరుకు రూ.100 పైగా పలుకుతోంది. నెయ్యి కిలో రూ.4,800 పైగా అమ్ముడవుతోంది. అనుబంధంగా చీజ్, పన్నీరు తదితరాలనూ చేసుకోవచ్చు.
* దేశవాళీ ఆవుల డెయిరీ ప్రాజెక్టులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. వాలంటీర్ల ద్వారా పాలు, ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తీసుకుని సరఫరా చేయడంతోపాటు... ‘గో పుష్ఠి’ పేరిట అమూల్ కేంద్రాలు, మత్స్యశాఖ హబ్లు, జనతాబజార్ల ద్వారా మార్కెటింగ్ చేయనుంది.
1824 వేల లీటర్ల పాలు...
ఒంగోలు ఆవులు మండుటెండలను, వణికించే చలిని.. అతివృష్టి, అనావృష్టి, కరవు కాటకాలను తట్టుకోవడంతోపాటు అధిక పాల దిగుబడిని ఇస్తాయి. గుంటూరు లాంఫారంలోని పశుపరిశోధనా స్థానంలో ప్రస్తుతం 30% ఆవులు... ప్రతి ఈతలో 1,500 లీటర్ల పాల దిగుబడిని ఇస్తున్నాయి. సగటున ఈతలో 1,200 లీటర్ల పాలిచ్చినా.. జీవిత కాలంలో 18,000 నుంచి 24,000 లీటర్ల మేరకు ఉత్పత్తి జరుగుతుంది.
ఒక్కో పిండానికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. దేశవాళీ అవుల సంతతి పెంపుదలలో భాగంగా ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 19 ఆవులు అద్దె గర్భం దాల్చగా... 9 దూడలు పుట్టాయి. ప్రతినెలా సుమారు 40 నుంచి 50 పిండాలను రైతులకు పంపిణీ చేస్తున్నాం. ప్రత్యేక విధానంలో ఆబోతు వీర్యాన్ని వాడటం ద్వారా... పుట్టేదూడల్లో 90% వరకు పెయ్య (ఆడ దూడ)లను పొందే అవకాశం త్వరలో రాబోతోంది. -డాక్టరు మురకొండ ముత్తారావు, ప్రధాన శాస్త్రవేత్త, శ్రీ వెంకటేశ్వర పశువైద్య పరిశోధనా స్థానం, లాం, గుంటూరు జిల్లా