నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 105 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల్లో రోడ్లు, భవన నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 95 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పరిశోధన కేంద్రం, రైతు శిక్షణాకేంద్రంతో కలిపి 50 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఒక ప్రభుత్వ సంస్థ భూములు మరొక ప్రభుత్వ సంస్థకు కేటాయించాలంటే జీవో నెంబరు 571 ప్రకారం పరిశోధనా స్థానం అధిపతి అనుమతి పొందాలి. అదేమీ జరగకుండానే భూముల కేటాయింపు జరగడం గమనార్హం. కేటాయింపు భూములపై సర్వే నెంబర్లతో రెండున్నర నెలల కిందట పరిశోధన కేంద్రానికి నోటీసులిచ్చారు. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరగా, వారంలోనే ఆర్ఏఆర్ఎస్ అధికారులు సమాధానం ఇచ్చారు. అందులో పరిశోధనలు ఏమి జరుగుతున్నాయో వివరాలతో ఇస్తూ, పంట భూములు కేటాయింపుకు అభ్యంతరం పంపారు. అయినా నేతల ఒత్తిళ్లతో బేఖాతరు చేశారు. నవంబరులో అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి ప్రత్యక్షంగా కేంద్రంలోని భూముల్లో పంటలను చూసి వెళ్లినా ప్రభుత్వ నిర్ణయం మార లేదు.
వ్యవసాయ పరిశోధన కేంద్రం 114 ఏళ్లుగా పరిశోధనలతో కొత్త వంగడాల సృష్టించి నంద్యాలకు విశేషమైన గుర్తింపు తెచ్చింది. దేశంలోనే ఆర్ఏఆర్ఎస్ ఏ1-గ్రేడ్గా మూడవ స్థానంలో నిలిచింది. పత్తిలో ఆరు రకాలు, పప్పు శనగలో 7 రకాలు ఈ కేంద్రం సృష్టించింది. వరిలో ఎన్డీఎల్ఆర్ -7, 8 రెండు రకాలు, పొగాకులో రెండు రకాలు విడుదల చేశారు. మొక్కజొన్నలో 7 రకాలు వృద్ధి చేయగా, ఎన్టీకే-5(తెల్లజొన్నలు), ఎన్-15 (పచ్చ) రకాలు ప్రాచుర్యం పొందాయి. పొద్దుతిరుగుడులో 3, కొర్రల్లో 5 రకాలు ఇక్కడి నుంచి బీజం వేసుకున్నవే.
రాయలసీమ రైతులకు నంద్యాల పరిశోధన కేంద్రం ఆయువుపట్టు లాంటిది. ఐసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్) నుంచి ప్రతి ఏటా రూ.25కోట్ల పైగా నిధులు అందుతాయి. ఐసీఆర్ కింద రాష్ట్రంలోనే 7 అత్యధిక పథకాలు అమలవుతున్నది ఇక్కడే. నెల రోజులుగా రైతులు, సంఘ నాయకులు, ఆర్ఏఆర్ఎస్ ఉద్యోగులు, కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇకపై ఒక్కో గ్రామ రైతులు ఒక్కో రోజు ధర్నాలకు దిగేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఇదీ చదవండి: ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు