రసాయన ఆహారమే కారణం...
విజయవాడ శివారు తాడేపల్లిలోని గోశాలలో గత నెల 85ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గోవుల మృతిపై వేసిన సిట్ దర్యాప్తు తుది దశకు చేరింది. సిట్ అధికారులు అన్ని అంశాలను క్రోడీకరించి నివేదిక తయారు చేస్తున్నారు. పశుగ్రాసంలో మితిమీరిన స్థాయిలో ఉన్న రసాయన అవశేషాలే పశువుల మృతికి కారణమని సిట్ బృందం స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే...
గోవులకు తిన్న పశుగ్రాసానికి వాడిన పురుగుమందులు, ఎరువులు , తదితరవాటిని అధికారులు పరీక్షించారు. గోశాలకు సంభందించిన దస్త్రాలను కూడా తనిఖీ చేసి.. నిర్వహణ తీరు , నిర్లక్ష్యం , తదితర అంశాలను పరిశీలించారు . గన్నవరం విశ్వవిద్యాలయ కమిటీ కూడా నమూనాలు పరీక్షించింది. సాధారణంగా పచ్చి గడ్డిలో నైట్రేట్లు,నైట్రైట్ల అవశేషాలు 1.6 శాతం లోపు ఉండాలి . ఈ పరిమితి దాటితే విషపూరితంగా మారుతుంది . గోవులకు ఇచ్చిన పశుగ్రాసంలో 3.8 గ్రాముల నుంచి గరిష్ఠంగా 4 గ్రాముల వరకు నైట్రేట్లు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఎక్కువ పరిమాణంలో గ్రాసాన్ని తిన్న ఆవులు మృతి చెందాయి. తక్కువ తిన్నవి అస్వస్థతకు గురయ్యాయని తేలింది. అధిక నైట్రైటు కలిసిన గ్రాసాన్ని తినడం వల్ల రక్తంలో మెత్ హిమోగ్లోబిన్ ఏర్పడి..ఆవులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని పరీక్షల్లో తేలింది.
ఎక్కువ నైట్రేట్లు ఉన్న ఆహారం వల్లే ఇలా...
నైట్రేట్లు అధికంగా ఉన్న గ్రాసాన్ని తీసుకోవటం వల్లే గోవులు మృతి చెందాయని సిట్ అధికారులు నిర్దారించారు. పూర్తి నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు అందచేయనున్నట్లు తెలిపారు.