అనంతపురం జిల్లా డీ.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కన్న కొడుకుపై హత్యాయత్నం చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు రాయదుర్గం రూరల్ సీఐ రాజా వెల్లడించారు. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెల్లికెర తాలూకా మరెమ్మనహళ్లి గ్రామానికి చెందిన దంపతులు మల్లిఖార్జున-శృతి. వారి ఆరేళ్ల కుమారుడు దినేశ్. అయితే శృతికి డీ.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శివతో వివాహేతర సంబంధం ఉంది. ఫలితంగా ఆమె తన కుమారుడితో కలిసి పది రోజుల క్రితం ఓబుళాపురానికి వచ్చింది. స్థానిక కన్నడ పాఠశాల సమీపంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఉంటోంది.
కాళ్లు, చేతులు కట్టేసి...
ఆదివారం స్థానికంగా ఉండే కొందరు పిల్లలు దినేశ్ కోసం ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ బాలుడి నోటిలో గుడ్డలు కుక్కి, చేతులు వెనక్కు కట్టేసి ఉండటాన్ని గమనించారు. భయంతో వెళ్లి వారి తల్లిదండ్రులకు చెప్పగా వారు వెళ్లి ఆ పిల్లాడిని విడిపించారు. బాలుడి కాళ్లు, శరీరంపై వాతలు, ఎడమ చేతిని విరగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అడ్డు తొలిగించుకోవాలనే..
తాము పెళ్లి చేసుకుని ఉండాలనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న దినేశ్ను చంపబోయామని శృతి, శివ ఒప్పుకున్నారు. అయితే వారిని ఆదివారం రాత్రి బెయిల్పై పంపించారు. బాలుడు తన తల్లి దగ్గరకు వెళ్లడానికి భయపడటం వల్ల ప్రస్తుతం వారికి పరిచయం ఉన్న వారి ఇంటిలో బాబును ఉంచారు.
కర్ణాటకలో ఉన్న బాలుడి తండ్రి మల్లికార్జునను పిలిపించాం. వారి సొంత ప్రాంతమైన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చిత్రలేఖ పోలీస్ స్టేషన్ ఎస్సై మంజునాథ్తో మాట్లాడా. ఈ హత్యాయత్నం కేసును చిత్రలేఖ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశాం. పి. రాజా, రాయదుర్గం రూరల్ సీఐ
ఇదీ చూడండి: