కరోనా కష్ట సమయంలో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మంచి పద్ధతి కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్లుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తెదేపా బహిష్కరిస్తోందని వెల్లడించారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్ ఆలోచించడం లేదన్న ఆయన.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం పెట్టారా ? అని నిలదీశారు. ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోవాలన్న ఆయన.. పక్క రాష్ట్రాలను చూసి కూడా సీఎం జగన్ నేర్చుకోవటం లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ నిర్లక్ష్యానికి 106 మంది బలి
సీఎం జగన్ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక 106 మంది చనిపోయారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు పడకలు, మందులు, ఆహారం అందటం లేదని విమర్శించారు. తమ ప్రాణాలు కాపాడాలని కరోనా రోగులు కోరుతున్నారన్నారు. తమిళనాడు, కేరళ తరహాలో కరోనా రోగులకు నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగన్ డెమోక్రటిక్ డిక్టేటర్గా వ్యవహరిస్తున్నారు: యనమల
డెమోక్రటిక్ డిక్టేటర్గా జగన్ వ్యవహరిస్తున్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. గత 2 ఏళ్లలో కేవలం 39 రోజులు మాత్రమే సమవేశాలు నిర్వహించారన్నారు. మాట్లాడే అవకశాం ఇవ్వకుండా ఎలాంటి చర్చకు తావులేని సమావేశాలు కాబట్టే బహిష్కరిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతరంగా మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటామన్నారు. రాజ్యాంగం ప్రకారం రెండు బడ్జెట్ సమావేశాల మధ్య 16 నెలలకు మించి వ్యవధి ఉండకూదనే తూతూ మంత్రంగా ఒక్కరోజు సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుకున్నది గవర్నర్ ద్వారా చెప్పించి పొగుడుకోవటానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఇదీచదవండి: 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల