లాక్ డౌన్ నేపథ్యంలో ఫోనులో ఆర్డరు ద్వారా వినియోగదారులకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి నగరంలోని కలెక్టరు విడిది కార్యాలయంలో సోమవారం శ్రీకారం చుట్టారు. కలెక్టరు ఇంతియాజ్, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జేసీ కె.మాధవీలత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బంగినపల్లి మామిడి, జామ, అరటి, బొప్పాయి, నిమ్మ వంటి 5 రకాల పండ్ల కిట్ను రూ.100లకు విక్రయిస్తారు. బంగినపల్లి, పెద్ద, చిన్న రసాల మామిడి పండ్లను 5 కిలోల చొప్పున రూ.250లకు అందజేస్తారు. వినియోగదారులు 79950 86891 నంబరుకు ఫోను చేసి ఆర్డరు ఇస్తే, ఉద్యాన శాఖ అధికారులు పేర్లు నమోదు చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయానికి పండ్లను సరఫరా చేస్తారని కలెక్టరు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం మామిడి పండ్లను రైపనింగ్ ఛాంబరులో ఎథిలిన్ గ్యాస్ ద్వారా మగ్గబెట్టి విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ మంది ఆర్డర్లు ఇస్తే సరఫరాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుబజార్ల ద్వారా విక్రయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. దిల్లీ నుంచి వచ్చే మామిడి వ్యాపారులు కుమ్మక్కు అవుతున్నారని, ఈక్రమంలో తమ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. చెరకు రసాల ఎగుమతుల ఆర్డర్లు ఊపందుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాస్, మెప్మా పీడీ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...