రాష్ట్రంలో చాలాకాలంగా పూర్తిస్థాయి ధార్మిక పరిషద్ లేదు. ఓకేసు విషయంలో హైకోర్టు ఆదేశాల ధిక్కరణపై మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవాదాయ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తితిదే ఈవోతో కూడిన పరిషద్ మాత్రమే కొనసాగుతోంది. 2020లో తిరుపతి హథీరాంజీ మఠాధిపతిని తొలగిస్తూ అప్పటి దేవదాయ కమిషనర్, ధార్మిక పరిషద్ కార్యదర్శి హోదాలో ఆదేశాలిచ్చారు. దీనిపై ఆ మఠాధిపతి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి కార్యవర్గం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగురితో కూడిన ధార్మిక పరిషద్ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ చట్టసవరణ చేసింది. దీన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీసింది. కొంతకాలం కిందట దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వగా..ఈ కేసుపై మంగళవారం విచారణ జరగనుంది.
మరోవైపు బ్రహ్మంగారి మఠానికి చెందిన మఠాధిపతి మృతి చెందడంతో.. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని మఠాధిపతిగా నియమించాలనే దానిపై వివాదం ఏర్పడింది. దేవాదాయశాఖ తరపున తాత్కాలికంగా ఒక ఇన్ఛార్జిని నియమించారు. మఠాధిపతి రెండో భార్య హైకోర్టును ఆశ్రయించారు. నలుగురితో కూడి ధార్మిక పరిషద్కు అధికారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి పరిషద్ ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటరమణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కె.సూర్యారావు, రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లాం, దేవాదాయశాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ ఏబీ కృష్ణారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు దాతులూరి జగన్నాథరాజు సహా పలువురిని సభ్యులుగా నియమించింది.
దేవాదాయశాఖకు సలహా మండలిగా వ్యవహరించే ధార్మిక పరిషద్ 25 లక్షల నుంచి కోటి వరకు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకవర్గాలను నియమిస్తుంది. ఉల్లంఘనలు జరిగి, ఫిర్యాదులు వచ్చినపుడు మఠాధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం.. మఠాధిపతి చనిపోతే కొత్త వారిని నియమించే అధికారం ధార్మిక పరిషద్కు ఉంటుంది.
ఇవీ చదవండి..