వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలను జనాభా ప్రాతిపదికన విభజించి వారి అభ్యున్నతి కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం జగన్ సూచనలు జారీ చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఇతరనేతలతో సమావేశమైన సీఎం నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స, మోపిదేవి, అనిల్కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేసిన బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదిక పై సీఎం చర్చించారు. ఆ నివేదికలోని అంశాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని నిర్ణయించారు. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి..ఆమేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వర్గాల అభ్యున్నతికోసం 139 కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు.
పదివేల లోపు ఉన్న సంచారజాతులకు సరైన గుర్తింపు నిచ్చి..వారు సమాజంలో నిలదొక్కుకునేలా చేయూతనివ్వాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై మరోసారి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీచదవండి