తిరుపతి ఉపఎన్నికలో ఓ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించటంపై భాజపా-జనసేన కూటమి తరపున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. వైకాపా మంత్రులే బినామీ వ్యక్తులతో చిన్న చిన్నపార్టీలు, స్వతంత్రులను పోటీలో దింపి క్రాస్ ఓటింగ్ చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఈ అంశంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
పవన్ కల్యాణ్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైకాపా మంత్రులపై విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విమర్శలు చేసిన కొడాలి నాని, పేర్ని నానిలను దుయ్యబట్టారు. తిరుపతిలో భాజపాను ఎదుర్కోలేకనే 10మంది మంత్రులు, 30మంది శాసనసభ్యులను వైకాపా రంగంలోకి దింపిందన్నారు. ఓటుకు 2వేల రూపాయల చొప్పున 100కోట్ల రూపాయలు పంచేందుకు సిద్ధమైన వైకాపా నేతలు.. భాజపా-జనసేన నాయకులపై విమర్శలు చేయటం సిగ్గు చేటన్నారు. విగ్రహాలు, ఆలయాల ధ్వంసం కేసుల్లో భాజపా నేతలు ఉంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి; 8న పరిషత్కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు