గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కాలిగిట్టల వ్యాధి నివారణకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) టీకాను అభివృద్ధి చేసింది. దేశంలో తొలిసారిగా పోషకులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రీయ కృషీ వికాస్ యోజన (ఆర్కేవీవై) నిధులతో 2015 నుంచి తిరుపతిలోని రాష్ట్రస్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో డాక్టర్ రాణిప్రమీల నేతృత్వంలో పరిశోధన చేపట్టారు. ఇక్కడ అభివృద్ధి చేసిన టీకాను జీవాలపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించారు. ఈ పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనో లాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్)తో ఈనెల 14న ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.పద్మనాభరెడ్డి శుక్రవారం తెలిపారు. ఐఐఎల్ టీకాలను తయారుచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇదీ వ్యాధి తీవ్రత
వర్షాకాలంలో చిత్తడి నేలల్లో మేతకు వెళ్లినప్పుడు మట్టిలోని వ్యాధి కారకాలు గొర్రెలు, మేకల కాలిగిట్టల్లోకి ప్రవేశించి కాళ్లను బలహీనపరుస్తాయి. ఈ వ్యాధి సోకిన జీవాలు మందలో వెనుకబడతాయి. నడవలేక, ఆహారం తీసుకోలేక బలహీనపడి చనిపోతాయి. ఒకవేళ కోలుకున్నప్పటికీ వాటిలో పునరుత్పత్తి సమస్యలు తలెత్తి పోషకులకు నష్టం వాటిల్లుతోంది. దేశంలో తొలుత కశ్మీర్లో కాలిగిట్టల వ్యాధి ఉద్ధృతంగా కన్పించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో 2015లో ఎస్వీవీయూలో పరిశోధనలు ప్రారంభించారు. ఇక్కడ తయారు చేసిన టీకాను ఏడాదికి రెండు సార్లు వేయాలని, ఈ డోసు ఖర్చు రూ.5-6 వరకు అవుతుందని శాస్త్రవేత్త డాక్టర్ రాణిప్రమీల తెలిపారు. వర్షాకాలంలో టీకా వేస్తే వ్యాధిని ముందుగానే నివారించవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: