ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతేడాది మే నెలలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం.. లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవడంతో కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛను రద్దు చేయనుంది. దివ్యాంగ, అభయహస్తం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల డీఎంహెచ్వో పింఛన్లకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఒకే రేషన్ కార్డుపై రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఒకరి పేరు మీద తాఖీదులు పంపింది. ఈ నెల 13న జారీ చేసిన ఈ తాఖీదులను వాలంటీర్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
7 రోజుల్లో అర్హత నిరూపించుకోకుంటే శాశ్వతంగా రద్దు
‘2019 డిసెంబరు 13న జారీ చేసిన ఉత్తర్వు 174 ప్రకారం పింఛను సంఖ్యను నమోదు చేసి మీ వ్యక్తిగత/ కుటుంబ వివరాలను పరిశీలించాం. మరొకరు కూడా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు మిమ్మల్ని అనర్హులుగా గుర్తించాం. ఆ మేరకు పింఛనును తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. తాఖీదు అందుకున్న 7 రోజుల్లో ఏ పింఛను కొనసాగించాలో మండల కార్యాలయానికి రాతపూర్వకంగా తెలపాలి. పింఛను అర్హతకు తగు ఆధారాలు సమర్పించకపోతే శాశ్వతంగా రద్దు చేస్తాం’ అని తాఖీదుల్లో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: varalakshmi vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే..?