రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఎవరు బయటకొచ్చినా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తున్నారు అధికారులు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారికి జరిమానా విధిస్తారు. దుకాణాల నిర్వాహకులపైనా కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి తాఖీదులిచ్చి దుకాణాన్ని మూసి వేయించనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
మార్గదర్శకాలు
కఠిన చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు పలు మార్గదర్శకాలను నిర్దేశించారు. ప్రతి కుటుంబానికి వాలంటీర్లతో ఉచితంగా మాస్కులు అందించేలా చూడటం... బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోని వారిపై అధికారులు జరిమానా విధించాలి. వాలంటీర్లతో పాటు స్వయం, సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో కరోనా పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే దుకాణాలు తెరవాలి.
కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణాదారులదే. శానిటైజర్ అందుబాటులో పెట్టడం, రద్దీ ఎక్కువ ఉన్న చోట థర్మల్ స్కానింగ్ చేసేలా చూడాలి. నిబంధనలు ఉల్లంఘించే షాపులకు తాఖీదులిచ్చి మూసి వేయించాలి. నిర్మాణ ప్రదేశాల్లో గుట్కా, తంబాకు , పాన్ వినియోగంపై నిషేధం అమలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
నివేదిక ఇవ్వాల్సిందే...!
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను 14 రోజులపాటు గృహ పర్యవేక్షణలో ఉంచిన తరువాతే నిర్వాహకులు పనిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. మాస్క్ లు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. తమ పరిధిలోని పని ప్రదేశాలను పుర అధికారులు రోజు పర్యవేక్షించి కమిషనర్లకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఈనెల 18 నుంచి 22 వరకు అన్ని నగరాలు , పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పురపాలకశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: