She Teams Caught 285 Gundas at Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మహిళా సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళల భద్రత కోసం ప్రతిక్షణం పని చేస్తామన్నారు. ప్రతిరోజూ రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్ నిఘా కొనసాగుతుందని ఆమె తెలిపారు.
మహిళలను వేధించే వారిపై నిఘా పెట్టి వీడియో ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ వెల్లడించారు. బడా గణేశ్ను వీక్షించడానికి నగరంలో పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో షీ టీమ్స్ ప్రత్యేక నిఘాగా ఉంటుందని తెలిపారు. క్యూ లైన్లలో మహిళలతో వెకిలి చేష్టలకు పాల్పడుతూ, రద్దీగా ఉన్న చోట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిలను ఏడు రోజుల్లో అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు.