ఓటుతో ఉజ్వల భవిష్యత్కు యువత పునాది వేసుకోవాలి: జయప్రకాష్ నారాయణ - JP comments about vote - JP COMMENTS ABOUT VOTE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 11:58 AM IST
Jayaprakash Narayana Comments on Vote Importance : ఓటు ద్వారా యువత ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో యువత జాగృతం కావాలని పిలుపునిచ్చారు. చాలా మంది యువతలో రాజకీయం అంటే కోపం, నిస్పృహ పేరుకు పోయిందన్నారు. దేశ జనాభాలో సగం మందికి పైగా 25 ఏళ్ల లోపు యువత ఉన్నారన్నారు. యువత భవిష్యత్తును ఓటు ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు.
18 ఏళ్ల నిండిన యువత ఓటు హక్కు పొందకుంటే నామినేషన్ల ప్రక్రియ ముందు వరకు ఓటర్లుగా చేరటానికి అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును సులువు చేసిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు నిధులు ఎలా వినియోగిస్తున్నారన్న అంశంపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. యువత తమ బాధ్యతగా గుర్తించి తప్పనిసరిగా అందరూ ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.