TS Govt Provides Financial Assistance For Inter Caste Marriages : కులాంతర వివాహాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకం సంబంధిత జంటలకు ఏళ్లుగా అందడమే లేదు. స్థానిక సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎంత తిరిగినా రాకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఒక్కో శాఖలో ఒక్కో తీరు ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. బీసీ శాఖ ద్వారా రూ.10 వేలు అందిస్తుండగా, ఎస్టీ శాఖ ద్వారా రూ.50 వేలు వస్తున్నాయి. అదే ఎస్సీ సంక్షేమ శాఖలో రూ.2 లక్షల ప్రోత్సాహకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.5 లక్షలకు పెంచింది. 2021లో పెళ్లి చేసుకున్న వారికి ఇప్పటి వరకు అందలేదు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖలో కులాంతర వివాహాలకు సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు వంద పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 2019 అక్టోబర్కు ముందు రూ.50 వేల ప్రోత్సాహకం అందేది. అదే ఏడాది నవంబరు నుంచి దానిని రూ.2.50 లక్షలకు పెంచారు. ప్రస్తుతం రూ.5 లక్షలకు చేరింది. అయితే దరఖాస్తులకే పరిమితమవుతుండగా కార్యాలయం చుట్టూ తిరిగినా భరోసా లేని పరిస్థితి. కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం ఉండడం లేదని అర్జీదారులు వాపోతున్నారు.

"మాది కాగజ్నగర్ మండలంలోని నజ్రూల్నగర్ . 2021 మే 22వ తేదీన కులాంతర వివాహం చేసుకున్నాం. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకం కోసం 2021 ఆగస్టులో ఎస్సీ సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకున్నాం. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు అందడం లేదు. ఆశలు వదులుకోవాల్సి వస్తోంది." - దుర్గం శ్రీలత-సూరజ్మిత్ర, దంపతులు
సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. ఎవరైనా కార్యాలయానికి వెళ్లి సంక్షేమ పథకాల సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సిబ్బంది స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా అప్లై చేసుకోవాలి : కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఈ-పాస్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఏ వివరాలు ఇచ్చారో వాటి హార్డ్ కాపీలను జిల్లా కార్యాలయంలో అందించాలి. వాటిని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తారు. వాస్తవ పరిస్థితి తెలుసుకుని నిధులు మంజూరు చేస్తారు. ప్రోత్సాహకం భారీగా పెరగడంతో దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో మూడేళ్ల కిందటే అయిదు దరఖాస్తులు బడ్జెట్ లేక పెండింగ్లో ఉంచారు. బీసీ సంక్షేమ శాఖలోని దరఖాస్తుల సంఖ్య చెప్పే వారే కరవయ్యారు.
"కులాంతర వివాహాల ఆర్థిక ప్రోత్సాహానికి నిధులు మంజూరు కావడం లేదు. సీనియారిటీ ప్రాతిపాదికన ఏటా ఇద్దరు ముగ్గురికే మంజూరవుతుంది. ఎప్పుడు వస్తాయనే విషయం తెలియదు." - సజీవన్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి