Effects of Heat Waves Have Been Felt Since March : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మహాశివరాత్రి తర్వాత వేడి, ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి రెండు లేదా మూడో వారంలోనే రాష్ట్రంపై వడగాలులు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది.
ముచ్చెమటలే
- 1961 నుంచి 2020 మధ్యకాలంలో సేకరించిన వివరాల ప్రకారం మార్చి-జూన్ మధ్యలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది.
- నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి.
- వాతావరణ మార్పుల ప్రభావంతో గత 30 ఏళ్లలో వడగాలుల వ్యవధి 2.5 రోజులు పెరిగింది.
- 2015లో విపత్తు మాదిరిగా వడగాలులు విజృంభించాయి. ఆ ఏడాది మే 23 నుంచి 27 మధ్యకాలంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం నెలకొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2-3 రోజుల వ్యవధిలోనే 7 నుంచి 10 డిగ్రీలు పెరిగాయి.
- వడగాలులు సాధారణంగా 4 నుంచి 8 రోజులుంటాయి. కోస్తాంధ్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆ వ్యవధి 8 రోజుల కంటే ఎక్కువే.
దంచికొడుతున్న ఎండలు - పెరిగిన విద్యుత్ వినియోగం
అన్ని రంగాలపై ప్రభావం
కొన్నేళ్లుగా భారత్లో వడగాలుల ప్రభావం పెరుగుతోంది. ఇది వ్యవసాయ, రవాణా, విమానయానం, ఇలా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. అతి తీవ్ర వడగాలులు వీచే సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వ్యవసాయ రంగంలో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
3 నుంచి 5 డిగ్రీల పెరుగుదల : కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. విశాఖ, నరసాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల నమోదైంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ‘రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం ప్రారంభమైంది. ఈసారి తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలకు తేమ వాతావరణం తోడు కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది’ అని విశాఖకు చెందిన వాతావరణ నిపుణులు ఆచార్య భానుకుమార్ వివరించారు.