Colleges collecting Original Certificates : విద్యార్థుల నుంచి టీసీ మినహా మిగిలిన ఓ ఒక్క ధ్రువపత్రం ఒరిజినల్ తీసుకోరాదన్న నిబంధనలకు రాష్ట్రంలోని చాలా మేర ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలు పాటించడంలేదు. ఏదైనా కళాశాలలో ప్రవేశాల సమయంలో టీసీతో పాటు పది, ఇంటర్, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు రాబట్టేందుకు యాజమాన్యాలు ఈ సర్టిఫికెట్లనే అస్త్రాలుగా వాడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింమెంబర్స్ రాకున్నా ఫీజు మొత్తం చెల్లించే వరకు సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వట్లేదు
విద్యార్థుల సర్టిఫికెట్లు : దీంతో తమకు ఉద్యోగాలొచ్చినా ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యామండలి, జేఎన్టీయూహెచ్ అధికారులు చెబుతున్నా కళాశాల యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలకు కలిపి రూ.7 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. కొన్ని యాజమాన్యాలకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అందాల్సి ఉంది. దీంతో అనేక కళాశాలల యాజమాన్యాలు ‘ఒరిజినల్స్’ విషయంలో అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు.
- ఖైరతాబాద్లోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేసిన ఓ విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశించి 3 నెలలైనా ఇప్పటికీ అతీగతీ లేదు. ఆ విద్యార్థికి ప్రైవేటు ఉద్యోగం రావడంతో సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నాడు.
- తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దానివల్ల తమకు ఉద్యోగాలొచ్చినా ఇబ్బంది పడుతున్నామంటూ బాచుపల్లిలోని గోకరాజు ఇంజినీరింగ్ కళాశాలపై ఇటీవల కొందరు విద్యార్థులు విద్యాశాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కార్యాలయ సిబ్బంది జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటేశ్వర్రావుకు సమస్య చెప్పి పరిష్కరించాలని కోరారు.
- కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం కార్యాలయం నుంచే లేఖలు తెచ్చుకొని ఈ కళాశాల నుంచి ధ్రువపత్రాలు పొందినట్లు సమాచారం.
విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు : గత ఆగస్టు నుంచి వందల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాలతోపాటు సీఎంవోలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కాలేజీల్లో తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
విద్యాశాఖ లేదా విజిలెన్స్ బృందాలు తనిఖీచేస్తే లక్షల మంది విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు దొరుకుతాయని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ సూచించారు. పలు కాలేజీలు అధ్యాపకుల ధ్రువపత్రాలూ తీసుకుని వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలపై తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నారా? - ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
కాలేజీ మూసేసినా సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు ఎలా తీసుకోవాలంటే?