'బహుజన రాజ్య పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం' - ప్రజా ఆశీర్వాద సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Published : Nov 5, 2023, 4:23 PM IST
RS Praveen Kumar in Peddapalli Praja Ashirvada Sabha :తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనను తరిమికొట్టేందుకు.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BSP RS Praveen Kumar on Telangana Elections : తెలంగాణ ఏర్పాటు తర్వాత దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న మొదలు 9 ఏళ్లలో ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేకపోయాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్ష కోట్లు అప్పు చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏదేచ్ఛగా కుటుంబ పాలన సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. ఉద్యోగుల కల్పనలో కూడా కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. 30వ తారీఖు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నాయకులు బీఎస్పీలో చేరారు.