Warangal Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రైతు డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్... రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో... పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ డిక్లరేషన్ను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. భూమి ఉన్న రైతులతోపాటు కౌలుదారులకు ఏడాదికి రూ. 15 వేల పెట్టుబడి సాయం, భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.
నూతన వ్యవసాయ విధానం: అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు... చెరుకు పరిశ్రమలు తెరిపిస్తామని రేవంత్ వివరించారు. పంటబీమా ద్వారా పరిహారం, రైతు కూలీలకు రైతుబీమా ఇస్తామన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, ఎస్సీలు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్భూములకు... హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి ఆస్తులు జప్తు చేస్తామన్న రేవంత్... పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఎకరాదాకా నీళ్లిస్తామని తెలిపారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి... నూతన వ్యవసాయ విధానం, పంటల విధానం రూపొందిస్తామని తీర్మానించారు.