ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్ర ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా సజావుగా సాగింది. 9 గంటల తరువాత... పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. మధ్యాహ్నం కాస్త తగ్గినా... తిరిగి మూడుగంటలకు మళ్లీ పట్టభద్రులు కేంద్రాలవైపు తరలివచ్చారు. 4 గంటల సమయం ముగిసినా... చాలా చోట్ల పోలింగ్ అదనంగా మరో గంటన్నర సేపు కొనసాగింది.
యువత, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంటిపిల్లలను సైతం చంకనెత్తుకుని ఓటింగ్కు వచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరులో పెదనాన్న చనిపోయినా విషాదంలో ఉండి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు.
ఓటేసిన ప్రముఖులు...
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి.. వేలేరు మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి... ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థిని రాణి రుద్రమ, మహబూబాబాద్లో వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇతర అధికారులు ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ వరంగల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల స్పందన బాగుందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.